పట్టాభి అరెస్ట్ కేసు.. ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు!

  • ఏసీపీ రమేశ్, సీఐ నాగరాజులపై చర్యలు
  • అరెస్ట్ చేసే సమయంలో ఖాళీలతో నోటీసులు ఇవ్వడమే కారణం
  • డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఏసీపీకి ఆదేశం
ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టీడీపీ నేత పట్టాభిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే ప్రస్తుతం బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. మరోవైపు పట్టాభిని అరెస్ట్ చేసిన కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. బదిలీ వేటుకు గురైన వారిలో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేశ్, సీఐ నాగరాజు ఉన్నారు.

పట్టాభిని అరెస్ట్ చేసే సమయంలో ఖాళీలతో నోటీసులు ఇచ్చినందుకు మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఏసీపీ రమేశ్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సీఐ నాగరాజును ఏలూరు రేంజి డీఐజీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Pattabhi
Telugudesam
Police Officers
Action

More Telugu News